- కలిసివచ్చిన ఆసియా, ఐరోపా సంకేతాలు
- ఇప్పట్లో ఫెడ్ రేట్ల పెంపు ఉండదన్న అంచనాలు
- బలహీన అమెరికా ఉద్యోగ గణాంకాలు నేపథ్యం
- 565 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
- తొమ్మిది నెలల్లో ఇదే అత్యధిక ఒక రోజు లాభం
- 8000 పాయింట్ల పైకి నిఫ్టీ
అమెరికా ఉద్యోగ గణాంకాలు బలహీనంగా నమోదవడం.. ఆ దేశానికి ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు గాక.. ఆ దేశ రిజర్వు బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వుకు ఇప్పట్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం లభించకపోవచ్చు గాక.. అయితే ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లకు సానుకూలతలను తెచ్చిపెట్టాయి.
అక్కడ వడ్డీ రేట్లు పెంచకపోతే.. విదేశీ పెట్టుబడులు తమ మార్కెట్ల నుంచి వెనక్కి వెళ్లవన్న అంచనాలు పెరిగిపోయాయి. దీంతో భారత్ సహా పలు వర్థమాన దేశాల స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా లాభాలను తెచ్చిపెట్టాయి. వరుస నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1169 పాయింట్లు దూసుకెళ్లడంతో మదుపరి మోము వికసించింది.
ఆసియా, ఐరోపాల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న భారత మార్కెట్లు సోమవారం లాభాల పంట పండించాయి. సెన్సెక్స్ ఒకటిన్నర నెల గరిష్ఠానికి చేరింది. రిజర్వు బ్యాంకు అర శాతం మేర రెపో రేటును తగ్గించిన రోజు నుంచి ఇప్పటి దాకా వరుస నాలుగు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 1168.71 పాయింట్లు లాభపడడం విశేషం. సోమవారం సెన్సెక్స్ తొలుత స్వల్ప లాభాలతోనే ప్రారంభమైనా.. మధ్యాహ్నం ఐరోపా సంకేతాలను అందుకున్న తర్వాత అంతకంతకూ పెరిగింది. ఒక దశలో 26,822.42 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 564.60 పాయింట్ల లాభంతో 26,785.55 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) కీలక సూచీ నిఫ్టీ ఏకంగా 168.40 పాయింట్లు పెరిగి తిరిగి 8000 పాయింట్ల పైన 8119.30 వద్ద ముగిసింది. అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీలు జనవరి 15 తర్వాత ఒక రోజు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. అంటే దాదాపు తొమ్మిది నెలల్లో అత్యధిక ఒక రోజు లాభం ఇదేనన్నమాట. ఆసియాలో చైనా, టోక్యో, హాంకాంగ్, దక్షిణ కొరియా సూచీలు 0.76-1.62% మేర; ఐరోపా మార్కెట్లు 2.12-3.35% మేర లాభపడ్డాయి.
టాటా మోటార్స్ జోరు..
అమెరికాలో జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాలు పెరిగిన నేపథ్యంలో టాటా మోటార్స్ సెన్సెక్స్ షేర్లలో అత్యధిక లాభాన్ని పొందింది. ఒక దశలో 8.41% దూసుకెళ్లి రూ.322కు చేరిన ఈ స్క్రిప్ చివరకు 6.13% లాభంతో రూ.315.20 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.4856.61 కోట్లు పెరిగి రూ.90,605.61 కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 షేర్లలో 26 సానుకూలంగా ముగిశాయి. టాటా స్టీల్(5.82%), ఐసీఐసీఐ బ్యాంకు(4.9%), హిందాల్కో(4.74%), హెచ్డీఎఫ్సీ(4.73%), ఎల్ అండ్ టీ(4.12%), హీరో మోటోకార్ప్(4%)లు రాణించగా.. మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, హెచ్యూఎల్లు 1.13-3.59% దాకా నష్టాల పాలయ్యాయి. యంత్రపరికరాల సూచీ అత్యధికంగా 3.28% రాణించగా.. మౌలిక(3.04%), బ్యాంకెక్స్(2.8%), లోహ(2.49%) సూచీలు కూడా ఫర్వాలేదనిపించాయి. బీఎస్ఈ మధ్య స్థాయి, చిన్న స్థాయి సూచీలు సైతం 1.79%, 1.62 శాతం చొప్పున పెరగడం రిటైల్ మదుపర్లు కొనుగోళ్లకు దిగారన్న విషయాన్ని వెల్లడిస్తోంది. ఇక బీఎస్ఈలో మొత్తం మీద 2001 స్క్రిప్లు లాభాల్లో ముగిసి.. కేవలం 792 మాత్రం నష్టాలతో స్థిరపడడం చూస్తే మార్కెట్లో సానుకూలతల ప్రభావం ఎంతగా ఉందో తెలుస్తుంది. ఇక గత ట్రేడింగ్ సెషన్తో పోలిస్తే మొత్తం టర్నోవరు రూ.2937.37 కోట్ల నుంచి రూ.3036 కోట్లకు పెరిగింది.
మార్కెట్ ఎందుకు పెరిగిందంటే..
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఈనెల 29న రెపో రేటును అరశాతం మేర తగ్గించింది. వడ్డీ రేట్లతో సంబంధముండే రంగాల్లో ఇది జోరు తీసుకొచ్చింది. బ్యాంకులు సైతం ప్రామాణిక రుణ రేట్లను తగ్గిస్తూ ప్రకటనలు విడుదల చేయడంతో ఆ జోరు మరికాస్త పెరిగింది.
* రూపాయి మారక విలువ స్థిరంగా ఉండడం కూడా కలిసివచ్చింది. అంతర్జాతీయంగా లోహ ధరలు పెరగడం కూడా ఒక కారణం.
* వాహన విక్రయాలు రాణించడంతో వాహన కంపెనీల షేర్లు దూసుకెళ్లి, సూచీని ముందుకు తీసుకెళ్లాయి.
* అన్నిటికి మించి అమెరికా పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన సూచీలకూ మద్దతునిచ్చాయని చెప్పాలి. ఎందుకంటే అక్కడి ఉద్యోగ గణాంకాలు (సెప్టెంబరు నెల) అంచనాల కంటే దిగువగా నమోదు కావడంతో ఫెడరల్ రిజర్వు ఇప్పుడప్పుడే వడ్డీ రేట్ల పెంచడానికి సాహసించకపోవచ్చన్న అంచనాలతో ప్రపంచ వ్యాప్త మార్కెట్లు రాణించాయి. ఆ సానుకూల పవనాలు మనవైపునకూ వచ్చాయి.
(ఈనాడు వారి సౌజన్యంతో)
Comments