ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్లో జపనీస్ ఓరియెంటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు గాను జపాన్కు చెందిన జెజిసి కార్పొరేషన్తో జిఎంఆర్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ కాకినాడ సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. సీ ఫుడ్, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, డెయిరీ ఉత్పత్తులు వంటి వాటి ప్రాసెసింగ్తో పాటు ఇక్కడి నుంచి ఎగుమతి చేసేందుకు అవసరమైన నివేదికను జెజిసి, జిఎంఆర్ సంయుక్తంగా చేపట్టనున్నాయి.
విలువ ఆధారిత ఉత్పత్తులతో పాటు రెడీ టు ఈట్ ఉత్పత్తులతో కూడిన ఈ పార్క్ను 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు.
ఇటీవలి కాలంలో భారత్, జపాన్ ప్రభుత్వాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జపాన్ ఆర్థిక, వాణిజ్య, మంత్రిత్వ శాఖ (ఎంఇటిఐ) చేపట్టిన చర్చలకు అనుగుణంగా భారత్లో జపనీస్ పరిశ్రమలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టుకుంటూ వస్తున్నాయని ఇందులో భాగంగానే జెజిసితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిఎంఆర్ ఇన్ఫ్రా తెలిపింది.
జపాన్కు చెందిన మంత్రిత్వ శాఖలైన.. జెబిఐసి, జెట్రో, ఎంఇటిఐ, భూ అభివృద్ధి, రవాణా మంత్రిత్వ శాఖ (ఎంఎల్ఐటి), వ్యవసాయ, మత్స్య, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంఎఎఫ్ఎఫ్)లు సహా జపనీస్ ఆర్థిక సంస్థలు ప్రతిపాదిత ఫుడ్ పార్క్కు మద్దతునిస్తామని ప్రకటించాయని జిఎంఆర్ పేర్కొంది. అపారమైన చమురు, సహజ వాయువు నిక్షేపాలున్న తూర్పు తీరంలోని కాకినాడలో జిఎంఆర్ గ్రూప్.. 10,500 ఎకరాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ను అభివృద్ధి చేస్తున్న సంగతి విదితమే.
(ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో )
Comments