నెల తిరిగేసరికి వేల రూపాయలు జీతంగా చేతికందే ఉద్యోగం చేయడంవేరు... 24 గంటలూ కష్టపడి ఓ వ్యాపార సంస్థను నిర్మించడంవేరు. తన ఈడు వారిలో చాలామంది మొదటి మార్గాన్ని ఎంచుకుంటే తెలుగు కుర్రాడు రాజు వానపాల మాత్రం రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు. మూడు పదుల వయసులో ‘వే2ఆన్లైన్’ పేరుతో వందల కోట్ల రూపాయలు విలువచేసే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇంకా తన రాజ్యాన్ని విస్తరిస్తానంటున్నాడు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
చదువు పూర్తిచేశాక ఉద్యోగానికి వెళ్లకూడదని ఎంసీఏ చదువుతుండగానే నిర్ణయించుకున్నాను. అన్నయ్య వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఇల్లు గడవడానికి ఇబ్బందిలేదు. అమ్మ కూడా నాకు నచ్చిన రంగంలోకి వెళ్లమని ప్రోత్సహించేది. అందుకే ఏదైనా సొంతంగా చేద్దామని అనుకునేవాణ్ని. అన్నయ్య అప్పట్లో షేర్లలో డబ్బు పెట్టేవాడు. దాంతో వివిధ కంపెనీలూ, వాటి వ్యవస్థాపకుల గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తిలాంటి వారి గురించి తరచూ చెబుతుంటే ఆ స్థాయికి వెళ్లాలని నాకూ అనిపించేది. 2003లో నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంసీఏ పూర్తిచేశాను. మా క్లాసులో అందరూ ఉద్యోగాల్లో చేరిపోయారు. నేను మాత్రం కంపెనీ పెట్టాలనే లక్ష్యంతో హైదరాబాద్లో అడుగుపెట్టాను. కానీ ఏం చేయాలి... ఎలా చేయాలన్నదానిపై స్పష్టతలేదు. ఆ సమయంలో బాలానగర్ పారిశ్రామిక వాడలోని ‘స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్’కు వెళ్లి అక్కడ ఉండే గ్రంథాలయంలో వివిధ రకాల వ్యాపార నమూనాల్ని పరిశీలించాను. మొదట్లో తయారీ రంగంలోకి వెళ్లాలనుకునేవాణ్ని. కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడిపెట్టే అవకాశం నాకు లేదు. దాంతో నా ఆలోచనని మార్చుకొని టెక్నాలజీ ఆధారిత వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాను. ఎంసీఏ నేపథ్యమూ అందుకో కారణం. కొన్ని వ్యాపారాల గురించి ఆలోచించాక ‘ఎస్సెమ్మెస్ అలెర్ట్’లు పంపే విభాగంలోకి వెళ్లాలనుకున్నాను. ‘సన్ సిలికా సొల్యూషన్స్’ పేరుతో ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే సంస్థలూ, కాలేజీలూ, పాఠశాలలకు సంబంధించి ఎస్సెమ్మెస్ అలెర్ట్లు పంపించే పని మాది. ఒకేసారి వందలూ, వేల మందికి మెసేజ్లు పంపించే వెసులుబాటు ఉండటంతో చాలా మంచి స్పందన వచ్చింది.
ఆలోచన వచ్చిన ఏడాదిన్నరకి
అనుకున్నట్టే సొంత కంపెనీని ప్రారంభించాను. భారీ లాభాలు లేకపోయినా వ్యాపారం బాగానే ఉంది. అయినా అసంతృప్తి. ఇంకా కొత్తగా, భారీగా ఏదైనా చేద్దామని ఉండేది. 2005 మేలో నెట్ నుంచి ఉచిత ఎస్సెమ్మెస్లు పంపే సేవల ఆలోచన వచ్చింది. అప్పటికి ఈమెయిల్ ఉచితంగా పంపించే అవకాశం ఉంది. కానీ మొబైల్ నుంచి పంపిస్తే ఎస్సెమ్మెస్కు రూపాయి, అర్ధ రూపాయి ఛార్జీ పడేది. ఆలోచన రాగానే ముందు 'way2sms.com' డొమైన్ని రిజిస్టర్ చేశాను. దీనికోసం నాకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని అర్థమైంది. ఏడాదిన్నరపాటు సంపాదించిన ప్రతి పైసా దాచి పెట్టుబడి సిద్ధం చేసుకున్నాను. 2006 చివరినాటికి వే2ఎస్సెమ్మెస్ ప్రారంభించాను. ప్రయోగ దశలో సరదాగా స్నేహితులకు మెసేజ్లు పంపినపుడు ‘ఏంటీ మెసేజ్లు’ అని అడిగేవాళ్లకి ‘వే2ఎస్సెమ్మెస్’ గురించి చెబితే ఆలోచన బాగుందని మెచ్చుకునేవారు. దాంతో నాకు నమ్మకం కుదిరి ఎలాగైనా పెద్దస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను. అధికారకంగా ప్రారంభమైన రోజు 126 మంది వివరాలు నమోదు చేసుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే వారి సంఖ్య వేలల్లోకి వెళ్లింది. సందేశాలు లక్షల్లోకి వెళ్లిపోయేవి. మొత్తానికి వే2ఎస్సెమ్మెస్ అందర్లోకీ సులభంగా వెళ్లిపోయింది. సైట్లోకి వచ్చినవాళ్లే మళ్లీ మళ్లీ వచ్చేవారు. గ్రూప్ మెసేజ్లు పంపేవారు. ‘గుడ్మార్నింగ్’, ‘హాయ్’ అన్న మెసేజ్లూ కొట్టేవారు. ఆ మెసేజ్లకు ఆపరేటర్లకి డబ్బు చెల్లించడంతో మూడు నెలల్లో నా దగ్గర డబ్బు అయిపోయింది. సర్వర్ల కెపాసిటీ దాటిపోయింది. వాటి సామర్థ్యం పెంచడానికి చేతిలో డబ్బులేదు. రెండ్రోజులు సేవలు నిలిపేశాం. ఆ సమయంలో అన్నయ్యకు విషయం చెప్పాను. నాపైన నమ్మకంతో కొంత డబ్బు ఇచ్చాడు. పెద్ద సర్వర్తో తిరిగి సేవలు ప్రారంభించాను. గంటలో 100 మంది రిజస్టర్ అయ్యారు.
స్పందన ఉంది కానీ...
వెబ్సైట్ నుంచి పంపించే ఎస్సెమ్మెస్లో చివరన ప్రకటన పెట్టి దానిద్వారా ఆదాయం తీసుకురావాలనేది మొదట్లో నా ఆలోచన. దానికి సంబంధించి మార్కెట్ నిపుణుల్ని సంప్రదించాను. కచ్చితంగా ప్రతి మెసేజ్ చూసి తీరుతారు కాబట్టి ప్రకటనలు వస్తాయని వాళ్లూ చెప్పారు. కానీ మేం ఎన్ని సంస్థల్ని సంప్రదించినా ప్రకటనలు ఇవ్వలేదు. ‘ఇంకా ఎక్కువ మంది ఉంటే అప్పుడు ఆలోచిస్తాం’ అనేవారు. మరోవైపు రోజురోజుకీ నిర్వహణ ఖర్చు పెరిగిపోయేది. రోజుకి లక్ష మెసేజ్లు వెళ్తే 28 వేలు చెల్లించాలి. ఒకవైపు వేలమంది మా వెబ్సైట్కి వస్తున్నారన్న ఆనందం. మరోవైపు ఆదాయం రావట్లేదన్న ఆందోళన. అప్పటికే రోజూ లక్షల్లో మెసేజ్లు వెళ్లేవి. రూ.లక్ష పైనే ఖర్చయ్యేది. ప్రతి నెలా ఎవరో ఒకరి దగ్గర డబ్బు తీసుకొని నడిపించేవాణ్ని. సేవల నాణ్యత తగ్గితే బ్రాండ్కి వచ్చిన స్పందన బూడిదలో పోసిన పన్నీరవుతుందని భయం. 2008కి వచ్చాక అన్ని దారులూ మూసుకుపోయాయి. నాకు అప్పుడు దాదాపు పాతికేళ్లు. నా వయసుకి లక్షల అప్పు అంటే అనుమానంగా చూసేవారు. అలాంటి అయోమయ స్థితిలో వెబ్సైట్కి ప్రకటనలు రావడం మొదలైంది. ఖర్చు లక్ష అయితే దాంట్లో సగం ప్రకటనల ద్వారా వచ్చేది. అయినా సగం లోటు. దాంతో ఎస్సెమ్మెస్ల సంఖ్యపైన నియంత్రణ మొదలు చాలా రకాలుగా ఖర్చు తగ్గే మార్గాల కోసం వెతికేవాణ్ని. ఏది ఏమైనా ముందుకు వెళ్లాల్సిందే, లేదంటే నాదో ఫెయిల్యూర్ స్టోరీగానే మిగిలిపోతుందనుకొని ముందుకు నడిచాను. క్రమంగా ప్రకటనలు పెరిగాయి. మరోవైపు ఎస్సెమ్మెస్ల ధరలు తగ్గాయి. ఎస్సెమ్మెస్కి 28 పైసలు నుంచి 2009లో ఎనిమిది పైసలకు తగ్గింది. ఆ సమయానికి ఇండియాలో టాప్- 500 వెబ్సైట్లలో మాకు స్థానం దక్కింది. నష్టాలు తగ్గుతున్న ఆ దశలో ముంబయి వెళ్లి ప్రకటనదారుల్ని కలిశాం. ఒక ప్రకటనల సంస్థ నుంచి నెలకు 18 లక్షలు వచ్చే ఒక ఒప్పందం వచ్చింది. అది టాటా గ్రూప్నకు సంబంధించినది. 2009 చివరినాటికి లాభనష్టాలు లేని స్థాయిని చేరుకున్నాం. దాదాపు మూడేళ్లు నష్టాల్లోనే నడిపాను. ఆ సమయంలో రోజూ 25వేల మంది కొత్తగా వివరాలు నమోదు చేసుకునేవాళ్లు.
పది సెకన్లలో చేరాలి...
ఎస్సెమ్మెస్ చేర్చే సమయం విషయంలో మేమెప్పుడూ రాజీ పడలేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్ నుంచి వెళ్లినపుడు ఎంత సమయం పడుతుందో దాదాపు అంతే సమయం, వీలైతే అంతకంటే తక్కువ సమయంలోనే మెసేజ్ వెళ్లేలా చేశాం. 10 సెకెన్లలోపే ఎస్సెమ్మెస్ని పంపించాలనేది మా లక్ష్యం. ఈ విషయంలో టెలికామ్ కంపెనీలతో పోటీపడేవాళ్లం. ఫోన్ నుంచి మెసేజ్ పంపించాక అది చేరుతుందని ఎంత నమ్మకంతో ఉంటామో అంతే నమ్మకాన్ని మా వినియోగదారుల్లోనూ నింపాలనేది మొదట్నుంచీ నా ప్రయత్నం. ఒక మెసేజ్ టెలికామ్ కంపెనీ సమస్య వల్ల చేరలేకపోయినా ఎన్ని సార్లయినా ప్రయత్నించి చేరవేసేవాళ్లం. డెలివరీ విషయంలో టెక్నాలజీ కోసం ఎంతో ఖర్చుచేశాం. మేం సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతికతనే వాడేవాళ్లం. ఇప్పటికీ మా ఆపరేషన్స్ టీమ్ డెలివరీ వేగాన్ని నిత్యం పరీక్షిస్తుంది. తేడా వస్తే వెంటనే సరిచేసుకుంటాం. 2010 నాటికి ప్రతి నెలా పది లక్షల మంది వచ్చి చేరేవారు. మా ఎదుగుదల హాకీ స్టిక్ మాదిరిగా ఒక్కసారి పైకి వెళ్లిపోయింది. వ్యక్తులే కాకుండా స్వచ్ఛంద సంస్థలూ, పోలీసు విభాగం, హాస్పిటల్స్, ప్రభుత్వ సంస్థలూ మా వినియోగదారుల్లో ఉన్నారు. వారు గ్రూప్ సందేశాలు పంపడానికి మా వెబ్సైట్ని ఉపయోగించుకునేవారు. పండగలపుడు ప్రత్యేకించి దీపావళీ, కొత్త సంవత్సరం సమయంలో మా సైట్కు వచ్చేవాళ్లసంఖ్య కోట్లలోనే ఉంటుంది. భవిష్యత్తులో పంపాల్సిన మెసేజ్లను ముందే షెడ్యూల్ చేసుకోవచ్చు. 2010, 2011, 2012... ఈ మూడేళ్లలో గూగుల్ ట్రెండ్స్ ఇండియా విభాగంలో చోటు సంపాదించిన భారతీయ కంపెనీలు వే2ఎస్సెమ్మెస్, ఐఆర్సీటీసీ మాత్రమే. ఆ సమయంలో పత్రికలూ టీవీల్లో మాకు బాగా ప్రచారం దక్కింది.
2011 నాటికి మేం పూర్తిగా లాభాల బాట పట్టాం. ఆదాయ మార్గాలూ పెరిగాయి. 2012లో ఒకదశలో మనదేశంలో టాప్-18 వెబ్సైట్గా ర్యాంకు సంపాదించాం. అదే సంవత్సరం ట్రాయ్ కొత్త నిబంధనలు వచ్చాయి. ‘వే2ఎస్సెమ్మెస్ లాంటి కంపెనీల సంగతి ఇక సరే’ అనుకున్నారు కొందరు. ఎందుకంటే ఎస్సెమ్మెస్ ఛార్జీలు ఎనిమిది రెట్లు పెరిగాయి. అప్పటికే ఆదాయ మార్గాలు పెరగడంతో మేం కొత్త నిబంధనల్ని పాటిస్తూ నిలదొక్కుకోగలిగాం. 2007లో మాకు పోటీగా 160by2.com సంస్థ ప్రారంభమైంది. 2008నాటికి వారినుంచి గట్టి పోటీ వచ్చింది. ఆ సమయంలో నాణ్యత విషయంలో రాజీపడకుండా ముందుకు వెళ్లాను. 2012లో ట్రాయ్ నిబంధనల సమయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికని కొంత డబ్బు సిద్ధంగా పెట్టుకున్నాను. కానీ డబ్బు పెద్దగా అవసరం పడలేదు. ఆ టైమ్లో 160by2 అమ్మకానికి వచ్చింది. అప్పటికి వారికి 1.2కోట్ల మంది వినియోగదారలుండేవారు. దాని వ్యవస్థాపకుడు హైదరాబాద్కే చెందిన సత్య నాకు స్నేహితుడు కూడా. ఆ సమయంలో 160by2 కొనుగోలు చేశాను. ఆ తర్వాత వాల్యూ ఫస్ట్ అనే సంస్థ ఈ రెంటినీ కలిపి రూ.200 కోట్లకు కొనేందుకు ముందుకు వచ్చింది. కానీ కొన్ని కారణాలవల్ల అది కార్యరూపం దాల్చలేదు.
మొబైల్ విపణిలోకి...
వే2ఎస్సెమ్మెస్లో 4.5 కోట్లమంది, 160by2లో 1.8 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఈ విభాగంలో మాదే అగ్రస్థానం. వీరంతా మేం రూపాయి కూడా ప్రకటనలకు ఖర్చు చేయకుండా వచ్చి చేరినవారే. మొబైల్లో ఇంటర్నెట్ వినియోగదారులు పెరగడంతో తొమ్మిది నెలల కిందట ఆప్ని తీసుకొచ్చాం. ఆప్లో 17 వేలమంది వెబ్లో అయిదువేల మంది రోజూ వచ్చి చేరుతున్నారు. మనదేశంలో రెండో అతిపెద్ద ఈమెయిల్ మార్కెటింగ్ కంపెనీ మాది. కంపెనీ ఎదుగుదలకు పదేళ్ల ప్రణాళిక వేస్తున్నాం. మరో 5 కోట్ల మందిని చేర్చాలనేది నా ముందున్న లక్ష్యం. వెబ్పైన ఉన్న కంపెనీని మున్ముందు పూర్తిగా మొబైల్ ఆధారిత కంపెనీగా తీర్చదిద్దనున్నాం.
ఆన్లైన్ విద్యనందించే ‘లెర్న్ సోషల్’ను 2014లో ప్రారంభించాం. వే2ఎస్సెమ్మెస్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. లెర్న్ సోషల్తో ఒక ప్రపంచస్థాయి వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాను. భారత్తోపాటు ఆగ్నేయాసియా, గల్ఫ్ దేశాల్లోకి ప్రధానంగా వెళ్లాలని చూస్తున్నాం. way2news మొబైల్ ఆప్ కూడా ప్రారంభించాం. త్వరలో ఈ-కామర్స్లోనూ అడుగు పెట్టబోతున్నాం.
పదేళ్ల కిందట నేను ఈరంగంలో అడుగుపెట్టినప్పటికీ ఇప్పటికీ పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. మనదేశంలోనే కొత్త ఆవిష్కరణలు రాబోతున్నాయి. మొబైల్మీద నెట్ వినియోగం పెరగడంవల్ల భవిష్యత్తుల్లో భారతీయ కంపెనీలే ప్రపంచానికి ఆ విభాగంలో మార్గనిర్దేశం చేస్తాయి. ఇప్పటికే చాలామంది అమెరికా పెట్టుబడిదారులు మనదేశంలో కార్యాలయాలు పెట్టుకున్నారు.
- సుంకరి చంద్రశేఖర్
ఇంకొంత...
అమ్మ ఇందిర. నాన్న సూర్యనారాయణ. రాజుకి పదేళ్లపుడు నాన్న చనిపోయారు. అన్నయ్య వ్యాపారి. పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నుంచి నల్గొండ జిల్లాకు వలస వచ్చారు.
* వ్యాపారంలో బంధువులు రాజశేఖర్, సురేష్ సహకారం అమూల్యమైనదంటారు రాజు.
* వే2మూవీస్ వెబ్పోర్టల్ కూడా ఉంది.
* వే2ఎస్సెమ్మెస్లో బయట పెట్టుబడిదారు ఎవరూ లేరు.
* వ్యాపారంలో అడుగుపెట్టాలంటే ఆలోచన ముఖ్యమనీ డబ్బు పాత్ర దాని తరవాతేనని చెబుతారు రాజు. అలా కాకుంటే ప్రతి సంస్థనీ టాటా, బిర్లా, అంబానీలే ప్రారంభించగలరంటారు.
* సంస్థలోని 200 మంది ఉద్యోగులకి మధ్యాహ్న భోజనం ఉచితం.
* ఈమెయిల్ అడ్వరై్టజింగ్లోకి అడుగుపెట్టబోతున్నారు.
మూలం:- ఈనాడు ఆదివారం పుస్తకం
Comments